విజయాన్ని కానీ, అపజయాన్ని కానీ నిర్ణయించేది విధి కాదు, అద్రుష్టం కాదు గ్రహగతులు కావు కేవలం మన చేతలే గెలుపు ఓటమిలను నిర్ణయిస్తాయి అని సామ్యూల్ వలెంటైన్ కొటే చెప్పిన మాటలు ఎవరికైనాచాలా ఆసక్తి కలిగిస్తాయి. ప్రతి మనిషి అయిష్టత కనబరిచేది ఓటిమి విషయంలోనే. ప్రతి మనిషి భయపడేది ఓటమికే. అయినా సరే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఓటమి పలకరిస్తూనే వుంటుంది. పరామర్శిస్తూనే వుంటుంది.
అసలు ఓటమి అంటే ఏమిటి? ఓటమి అనేది ఒక్కో మనిషి జీవితంలో ఒక్కోలా వుంటుంది. పదికోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించిన ఫాక్టరీని మూసుకోవలసి రావడం ఒక కోటీశ్వరుడికి ఓటమి అయితే వెయ్యి రూపాలతో పెట్టుకున్న టీ కొట్టును శాశ్వతంగా కట్టేయాల్సి రావడం మరో బడుగు జీవికి ఓటమి అవుతుంది. ఓటమికి సంబంధించి ఇంగ్లీషులో ఒక మంచి కొటేషన్ వుంది. విజయానికి అందరూ తండ్రులే. అపజయం అనాథ అన్నది కొటేషన్ అర్థం.. నిజానికి ఓటమి అంటే స్పష్టమైన నిర్వచనం ఏదీ లేదు. మనం అనుకున్నది సాధించలేకపోవడం. ఆశించినది పొందలేకపోవడం. లేదా చేతిలో పనిని చేయలేక పోవటాన్ని ఓటమిగా పరిగణిస్తుంటాం. సక్సెస్, ఫెయిల్యూర్ అనే రెండు మాటలు మనిషి జీవితంలో నిరంతరం తారసిల్లుతూనే వుంటాయి. ఓటమి నుంచి విజయం కేసి దూసుకెళ్లిన టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జు జీవితం గురించి విశ్లేషించుకున్నప్పుడు మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేని నాగార్జున అమెరికాలో ఎమ్.బి.ఎ చేయడానికి వెళ్లారు. తండ్రి టాలీవుడ్ లో గొప్ప నటుడు. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఎ.ఎన్ ఆర్ రెండు కళ్లు అని చెప్పుకునే రోజుల్లో నాగార్జునకు నటన మీద ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తితోనే అమెరికాలో మోడలింగ్ చేసి మన దేశానికి వచ్చిన తర్వాత తనకు కూడా సినిమాల్లో నటించాలని వుందని తల్లి దండ్రులతో చెప్పాడు. నటన మీద పెద్దగా పట్టులేని నాగార్జున సినిమాల్లోకి రావడంపై ఇంట్లో పెద్ద చర్చ జరిగింది. వ్యూహ్యం తయారైంది. అంతవరకు టాలీవుడ్ లో కనివిని ఎరుగని రీతిలో నాగార్జున ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడొస్తున్నాడోచ్ అంటూ వార్తలు సినిమా ఇండస్ట్రీని కమ్మేశాయి. ఎలాంటి సినిమా చేస్తే నాగార్జున చిత్ర రంగ ప్రవేశం సునాయసంగా వుంటుంది అనే చర్చలు మొదలయ్యాయి. అన్ని కథలను పరిశీలించారు. అప్పుడే బాలీవుడ్ లో జాకీష్రాఫ్ హీరోగా హీరో అనే సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా తో నాగార్జునను తెలుగులో పరిచయం చేస్తే బాగుంటుంది అని తలంచిన అక్కినేని నాగేశ్వరరావు గారు వి.మధుసూధన్ రావు ను దర్శకునిగా ఎంపిక చేశారు. యువతలో అంతా ఒకటే చర్చ. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు తన అభిమాన సంఘాలన్నిటికీ కబురు పంపారు. వాళ్లందరినీ సమావేశ పరిచి నా వారసుడు అక్కినేని నాగార్జునను హీరోగా పరిచయం చేస్తున్నాను. మీరందరూ నన్ను అభిమానించినట్టే నా బిడ్డ నాగార్జునను కూడా అభిమానించాలి అని చెప్పడం అప్పట్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. అభిమానుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు మరో మెట్టు పైకి ఎదిగినంతయ్యింది. అభిమానులకు సముచిత గౌరవమిచ్చి వారిని సమావేశ పరిచి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నాను అంటూ చెప్పిన మాటలు అభిమానుల హ్రుదయాన్ని హత్తుకున్నాయి. అందుకే తెలుగులో నాగార్జున పరిచయాన్ని అభిమానులంతా తమ ఇంట్లో మనిషిలా భావించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. అప్పటి నుంచి నాగార్జున కూడా అభిమానుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. నాగార్జున, అభిమానుల మధ్య సంబంధం భర్త్రుహరి సుభాషితాలలో ఓ చోట చెప్పిన సందర్భం గుర్తొస్తుంది.. నీరు పాలతో స్నేహం చేస్తుందట. తన స్నేహితుడైన నీటికి పాలు తన గుణాల్ని ఇస్తుంది. పాలు మరుగుతున్నప్పుడు అది భరించలేక నీరు ఆవిరైపోవడం. నిప్పుల్లోకి దూకడం చేస్తుందట. నీరు అలా అయిపోవడం చూడలేక పాలు పొంగి పొరలిపోవడానికి సిద్ధపడిపోతాయి. మళ్లీ పాలపై నీళ్లు చల్లితే ఏమవుతుంది? తన స్నేహితుడు తనను చేరాడనే ఆనందంతో పాలు యథాస్థితికి వస్తాయి కద. నా సంబంధం కూడా అభిమానులతో పాలు, నీళ్ల స్నేహబంధమే అన్నట్టు నిగూఢంగా నాగార్జున ఎన్నోసార్లు చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్ర హీరో తనయుడిని అట్టహాసంగా పరిచయం చేసిన ఘనత అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో లేదు. నాగార్జునను ప్రేక్షకులకు, యువతకు పరిచయం చేయడానికి అక్కినేని కుటుంబం సరికొత్త ప్రణాళికను ఏర్పాటు చేసింది. యువతను టార్గెట్ చేస్తూ, సినిమా పత్రికలలో నాగార్జున డిజైన్ తో వున్న స్టిక్కర్లను పంపిణీ చేయడం. అభిమాన సంఘాలకు స్టిక్కర్లు,, పోస్టర్లు పంపిణీ చేసి నాగార్జునను ప్రజలకు దగ్గర చేసింది. గడ్డం పెంచుకున్న ఎవరిని చూసినా ఇది నాగార్జున స్టైల్ అనేంతగా ఆ స్టిక్కర్లు, పోస్టర్లు యువతలో ప్రభావాన్ని చూపాయి. నాగార్జున హీరోగా నటిస్తున్న తొలి చిత్రానికి విక్రమ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారు. హీరోయిన్ గా శోభనను నిర్ణయించారు. ఆ సినిమాను కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో షూట్ చేశారు. సినిమా పూర్తయ్యాక ఎన్నో అంచనాలతో నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’ మే 23, 1986లో భారీ అంచనాలతో విడుదలైంది. బాలీవుడ్ లో హిట్ అయిన సబ్జెక్ట్ కావడం. పాటలు సూపర్ హిట్ అవ్వడం, అక్కినేని వారసుడి పరిచయం ఘనంగా చేయడం వెరసి విక్రమ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక కొత్త హీరోకు తొలి చిత్రానికే అంత ఓపెనింగ్స్ రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. విక్రమ్ సినిమా ద్వారా భారీ ఓపెనింగ్స్ సంపాదించుకున్న నాగార్జున తర్వాత వచ్చిన రెండు సినిమాలతో ఓటమిని చవిచూశాడు. తర్వాత విడుదలైన కేప్టెన్ నాగార్జు, అరణ్యకాండ చిత్రాలు నాగార్జున కెరీర్ లో పెద్ద అడ్డంకిగా నిలిచాయి. ఆ తర్వాత ఓటమి పాలైన రెండు చిత్రాలను చూసి నాగార్జున కుంగిపోలేదు. 1986, 1987 రెండు సంవత్సరాలలో 8 సినిమాలలో నటించారు. నాలుగో సినిమాగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ’మజ్ను‘ సినిమా విడుదలైంది. ఆ చిత్రంతో నాగార్జున తిరిగి తన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత గీతాక్రిష్ణ దర్శకత్వంలో సంకీర్తన, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, కిరాయి దాదా, ఆఖరి పోరాటం, చినబాబు, మురళీ క్రుష్షుడు, జానకిరాముడు ఇలా పది చిత్రాల తర్వాత తన కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే ఓ చిత్రంలో నటించాలని నాగార్జునకు అనిపించింది. అప్పట్లో మణిరత్నం పేరు పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఇక్కడే నాగార్జున వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి. ఓ అగ్ర హీరో కు, వారసుడు, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరితో సత్ససంబంధాలున్న నాగార్జున మణిరత్నం ఆఫీసుకు వెళ్లి నాతో ఒక సినిమా తీయండి సార్ అంటూ అడిగినట్టు ఓ ఇంటర్వూలో చెప్పారు. నాగార్జున వ్యక్తిత్వం నచ్చి మణిరత్నం నాగార్జునతో ఓ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ’అగ్ని నక్షత్రం‘ సినిమా కథను నాగార్జునకు చెప్పారు. అందులో నాగార్జున, వెంకటేష్ కలిసి నటిస్తే బాగుంటుందని తన మనసులోని ఆలోచనను నాగార్జునకు చెప్పారట. అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో నటించడం కుదరలేదు. అదే సినిమా కార్తిక్, ప్రభు హీరోలుగా ఘర్షణ పేరుతో తెలుగులో వచ్చింది. ఆ తర్వాత ఒక మంచి కథ కుదరడంతో నాగార్జునతో మణిరత్నం తొలిసారి తెలుగులో ’గీతాంజలి‘ సినిమాను నిర్మించారు. గీతాంజలి విడుదలయ్యాక. యువతరం గుండెల్లో నాగార్జునకు చెరగని ముద్ర వేసింది. అప్పటి యూత్ ను ఎవరితో మాట్లాడినా… గీతాంజలి ఎన్నిసార్లు చూశావ్ అనే మాటలే వినిపించేవి. ఇప్పటిలా పాటలు పదే పదే చూసే వీలు లేదు కాబట్టి గీతాంజలి పాటల కోసం కూడా ఎన్నోసార్లు సినిమాలకు వెళ్లే వాళ్లు. ఇక గీతాంజలి హీరోయిన్ గిరిజ లేచిపోదామా అనే డైలాగ్ అయితే తెలుగు రాష్ట్రాలను ఒక్క ఊపు ఊపేసింది.. అంతటి క్లాసిక్ ను చూసి ఇంకా అదే మానియాలో వున్న యువతకు ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమా అంతగా రుచించలేదు. ఆ చిత్రం పెద్ద ప్లాప్ అయినా దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. గీతాంజలి మానియా అలాగే కంటిన్యూ అయ్యింది. ఇక్కడ నాగార్జున గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం గురించి చర్చించుకుందాం. అనుకరణను నాగార్జున మొదటి నుంచి ఇష్టపడేవారు కాదు. మనిషి వ్యక్తిత్వం విషయంలో అనుకరణ అనేది చాలా చేటు తెచ్చిపెట్టే విషయం అని ఆయన బలంగా నమ్ముతారు. చాలా మంది ఫలానా సినిమా హిట్ అయ్యిందని అలాంటి జోనర్ సినిమాల్లోనే నటించడం. ఫార్ములా సినిమాలనే నమ్ముకొని ఇతరులను అనుకరిస్తూ ఒకటో, అరో సినిమాల విజయాలను పొంది, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటాయి. కానీ నాగార్జున ప్రతి నిమిషం కొత్తగా వుండేలా ఆలోచించేవారు. అంతకు ముందు పరిస్థితుల ప్రభావం వల్ల రెగ్యులర్ సినిమాల్లో నటించిన నాగార్జున గీతాంజలి తర్వాత తన పంథా పూర్తిగా మార్చుకున్నారు.
Social Plugin